"రాములో రాములా" అనే పాటని ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తామని ప్రకటించింది అల్లు అర్జున్, త్రివిక్రమ్ టీం. కానీ ఈ పాట విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 22 సాయంత్రం 4 గంటలకి ఈ పాట వస్తుందట. అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇది పార్టీ సాంగ్ అని చెప్తోంది టీం. ఇంతకుముందు వచ్చిన "సామజవరాగమనా" అనే పాట బాగా వైరల్ అయింది. తెలుగు సినిమాల్లోనే అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ రాములో రాములా పాట .. పార్టీల్లో, సంగీత్ కార్యక్రమాల్లో రెగ్యులర్ గా మోగే రేంజీలో ఉంటుందంట. థమన్ స్వరపరిచిన ఈ సాంగ్.. "ఆల వైకుంఠపురంలో" నుంచి రానుంది.
ఈ ఏడాది అల్లు అర్జున్ మూడు సినిమాలు ప్రకటించాడు. అందులో ఒకటి ఎండింగ్ కి వచ్చింది. అదే.. త్రివిక్రమ్ తీస్తున్న 'అల వైకుంఠపురంలో'. ఈ సినిమాతో పాటు సుకుమార్ డైరక్షన్లో ఒకటి, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరోటి చేస్తానని చెప్పాడు. 'ఐకాన్' పేరుతో వేణు శ్రీరామ్ తీయనున్న సినిమా ఇప్పుడు ఆగిపోయింది అని రూమర్ వైరల్ అవుతోంది.
సుకుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలు పెడితే ...పూర్తయ్యేసరికి ఎనిమిది, పది నెలలు పడుతుంది. ఆ తర్వాత అయినా స్టార్ట్ చేస్తాడా లేక ఎవరైనా పెద్ద దర్శకుడు కథ చెప్తే వెంటనే ఒకే అంటాడా అన్నది చర్చ. అందుకే 'ఐకాన్' సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లే భావించాలి.