"సాహో" సినిమాకి కొత్త విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ సారి డేట్ ఛేంజ్ అనేది లేదు. పక్కాగా ఆగస్ట్ 30నే రాక. ఎవరికైనా డౌట్స్ ఉంటే అవి చెరిపేసుకోండని చెప్పడానికే కాబోలు తాజాగా మరో కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. "ఏ చోట నువ్వున్నా..."అనే పాటలోని స్టిల్ ఇది. బాలీవుడ్ సింగర్ తులసీకుమార్ ఈ పాటని పాడింది. త్వరలోనే ఆ పాట కూడా విడుదల కానుంది.
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న "సాహో" మూవీ టీజర్ మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు రానుంది. ఈ టీజర్కి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో రాజీ పడడం లేదు. టీజర్లో ఒక చిన్న బిట్కి ఓ విదేశీ పాటని వాడాలనుకున్నాడు దర్శకుడు సుజీత్. ఆ పాటని కాపీ కొట్టడం ఇష్టం లేక, ఆ పాటకి భారీగా రాయల్టీ చెల్లించి టీజర్లో వాడుతున్నారు.
అవును.... చిన్న బిట్ కోసం 15 లక్షల రూపాయల రాయల్టీని చెల్లించారట. సినిమా క్వాలిటీ కోసం అంతగా ఖర్చు పెడుతోంది యూవీ క్రియేషన్స్ సంస్థ. ఈ సినిమా టీజర్ని ఈ నెల 5న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఐతే అప్పటి వరకు టీజర్ రెడీ అవుతుందా అనేది చూడాలి.