‘మా’వాళ్ళు ఏం చేసినా చిరిగి చేటంత అయి పేటంత కావాల్సిందే. అది వివాదం కావచ్చు... విరాళం కావచ్చు. శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకొనేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రూ.5 లక్షల చెక్కును ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చింది.
శివాజీరాజా, నరేష్ ల మధ్య మొదలైన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మొత్తానికి ముగిశాయి. అంటే ఏదో ఆ సవాళ్ళకి సమాధానాలు దొరకడం వల్ల సామరస్యంగా ముగిసింది అనుకొంటే భ్రమే. సినీ పెద్దలు రంగ ప్రవేశం చేసి ఇంతకంటే పరువుపోగొట్టుకోలేం అని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఆ షాపోడు, ఈ షాపోడు గొడవపడితే ఉప్పు రేటు బయటపడింది అన్నట్లు – అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల మధ్య గొడవ మూలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డొల్లతనం బయటపడింది.
మొన్నటి వరకు తిట్టుకున్న నరేష్, శివాజీరాజీ ఇపుడు రాజీపడ్డారు. రాజీపడ్డారు అనడం కన్నా రాజీ పడేలా చేశారు అనడం కరెక్ట్. మా అసోషియేషన్ 25 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా నిర్మాతలు కలగచేసుకొని సమస్యని సాల్వ్ చేశారు. కలెక్టివ్ కమిటీ అనే ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో పేరొందిన నిర్మాతలు మా సమస్యని పరిష్కరించారు. మా నిధులన్నీ గోల్మాల్ చేశాడని శివాజీరాజీపై ఆరోపణలు వచ్చాయి.