ఎమ్మెల్యేగా అధికారం చేపట్టాలని కలలు కన్నాడు నటుడు బండ్ల గణేష్. గత రెండు నెలలుగా ఎంతో కామెడీ పండించాడు. ఎమ్మెల్యేగా సీటు గ్యారెంటీ అనుకున్నాడు. బండ్ల గణేష్ తరఫున మీడియా యజమాని ఎంత లాబీయింగ్ చేసినా..కాంగ్రెస్ పార్టీ మాత్రం మొండిచెయ్యి చూపింది. ఐతే ఎమ్మెల్యేగా అధికారం బదులు అధికార ప్రతినిధిగా అధికారం ఇచ్చింది.
ఇక బండ్ల గణేష్..మీడియాతో కాంగ్రెస్ పార్టీ తరఫున అఫీషియల్గా మాట్లాడొచ్చు. కేసీఆర్..పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు అని తనదైన పరిజ్ఞానంతో ప్రశ్నించొచ్చు (ఇంతకుముందు ఒక సారి ఇలాగే అడిగాడు మరి!).
కమెడియన్ వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఐతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేట్గా నిర్ణయం తీసుకున్నాడో లేదో పార్టీ అతనికి టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ ఇపుడు బరిలో నిలిచాడు. సొంత ఊరు అయిన కోదాడలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు వేణుమాధవ్.
రాజకీయ పరిశీలకులు ఊహించినట్లే.. నందమూరి హరికృష్ణ కూతురిని ఎన్నికల బరిలోకి దింపుతోంది తెలుగుదేశం పార్టీ. హరికృష్ణ కూతురు సుహాసిని పేరుని కూకట్పల్లి అభ్యర్థిగా ఆ పార్టీ గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్న తొలి వ్యక్తిగా సుహాసిని నిలవనున్నారు. ఆమె మామ చుండ్రు శ్రీహరి మాజీ ఎంపీ.
నందమూరి కల్యాణ్రామ్ని ఈసారి తెలంగాణ ఎన్నికల బరిలో దింపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లోని కీలకమైన నియోజకవర్గమైన కూకటపల్లి నుంచి కల్యాణ్రామ్ని బరిలోకి దింపాలని ఇంతకుముందు ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు. ఐతే కల్యాణ్రామ్ ఈ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించాడు.