తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం చేసినపుడు అక్కడి సినిమా హీరోలంతా వచ్చి మద్దతిచ్చారు. కొందరు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు. మరి తెలుగు హీరోలు ఏం చేస్తున్నారు?. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ టాలీవుడ్ తారలపై తీవ్రస్థాయిలో తెలుగు దేశం నాయకుడు బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు చేశారు. ఉద్యమించకపోతే ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
"ప్రస్తుతానికి ఏ సినిమా చేసే ఆలోచన లేదు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడతాను," అని ఖరాఖండీగా తేల్చి చెప్పారు పవర్స్టార్ పవన్ కల్యాణ్. అజ్ఞాతవాసి తర్వాత ఆయన చేసే సినిమా ఏంటనే విషయంలో ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. వాటన్నింటికి తాళం వేశారు ఒక్క ప్రెస్మీట్తో. సోమవారం సాయంత్రం కరీంనగర్లో ఆయన విలేకర్లతో ముచ్చటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసేన పార్టీని ఎలా సంస్థాగతంగా డెవలప్ చేయనున్నారో, తమ పార్టీ లక్ష్యాలేంటో వివరించారు పవర్స్టార్.