జాహ్నవికి తొలి విజయం
శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటించిన తొలి చిత్రం ధడక్ ..హిట్ ఖాతాలోకి చేరింది. మొదటి మూడు రోజుల్లో బాగానే సంపాదించినా...వీక్ డేస్ లో నిలబడగలదా అన్న అనుమానాలుండేవి. ఐతే సోమ, మంగళవారం కూడా మంచి కలెక్షన్లను పొందింది ధడక్. ఇప్పటి వరకు ఇండియాలో 41 కోట్ల రూపాయలు వచ్చాయి. మొదటి వారం 50 కోట్ల మార్క్ని దాటుతుందని అంచనా. అంటే సినిమా హిట్ కిందే లెక్క.
జాహ్నవి నటన గురించి పెద్దగా ప్రశంసలు దక్కడం లేదు కానీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం సూపర్గా ఉందని క్రిటిక్స్ అంతా మెచ్చుకున్నారు. అంటే జాహ్నవి హీరోయిన్గా నిలబడడం ఖాయం. శ్రీదేవి తన కూతురు ఈ సినిమాతోనే అడుగుపెట్టాలని కోరుకొంది. ఆమె సెలక్షన్ కరెక్ట్ అనే తేలింది. ఐతే కూతురు మొదటి సినిమా చూడకుండానే ఆమె ఆకస్మిక మరణం చెందడం ఒక విషాదం.
జాహ్నవి నటనకి స్కోప్ ఉన్న పాత్రల కన్నా గ్లామర్ రోల్స్ ఎంచుకుంటే బెటర్ అనేది అభిప్రాయం. ఆమె ఇప్పటికే స్టయిల్ క్వీన్ అని పేరు తెచ్చుకొంది. మొదట గ్లామర్ తారగా నిలబడి, ఆ తర్వాత అనుభవంతో మంచి నటనకి ప్రాధాన్యం ఉండే పాత్రలు చేస్తే హీరోయిన్గా మంచి స్థానంలోకి వెళ్తుంది. ప్రస్తుతం జాహ్నవికి దక్షిణాదిలో అడుగుపెట్టాలనే ఆలోచన లేదట. జాహ్నవిని ఎలాగైనా తెలుగులో నటింపచేయాలని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ప్రయత్నాలు ప్రారంభించాడు.
- Log in to post comments