పాత ప్రకటనకి మరో వెయ్యి కలిపారు!
ఏడాదిన్నర క్రితమో, రెండేళ్ల క్రితమో ఒక ప్రకటన వచ్చింది. అల్లు అరవింద్, మధు మంతెన కలిసి మూడు భాషల్లో రామాయణాన్ని తీయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. అపుడు దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. అందులో రాముడిగా ఎవరు నటిస్తారు అని చాలా మంది చాలా రకాలుగా ఊహాలు అల్లేశారు. రామ్చరణ్ రామ్ అని హింట్ కూడా ఇచ్చింది గీతా ఆర్ట్స్ క్యాంప్. అందరూ ఈ ప్రాజెక్ట్ గురించి మరిచిపోయారు. ఇపుడు మళ్లీ దాని బూజు దులిపినట్లున్నారు
ఈసారి కూడా ప్రకటన వచ్చింది. ఈ అనౌన్స్మెంట్కున్న స్పెషాలిటీ ఏంటంటే.. ఈసారి బడ్జెట్ 1500 కోట్లు అని చెప్పారు. బాహుబలి ..రెండు పార్ట్లను 250 కోట్ల రూపాయలతో తీశారు. సాహోని 300 కోట్లతో తీస్తున్నారు. సైరా బడ్జెట్ కూడా 200 నుంచి 250 ఉంటుంది. ఇక అల్లు అరవింద్ ఏకంగా 1500 కోట్ల ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ప్రైమ్ ఫోకస్ అనే సంస్థతో కలిపి. దంగల్ దర్శకుడు నితిష్ తివాఈ, మామ్ సినిమా దర్శకుడు రవి ఉడయార్ కలిసి ఈ సినిమాని మూడు భాగాలుగా డైరక్ట్ చేస్తారట. రాముడు ఎవరు అనేది మళ్లీ సస్పెన్సే.
ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో మొదలయి, 2021లో విడుదల అవుతుందట. అల్లు అరవింద్ తాను మొదలుపెట్టబోతున్న డిజిటిల్ స్ట్రీమింగ్ కంపెనీ ప్లాన్లో ఇది భాగమా? చూడాలి.
- Log in to post comments