నా జన్మ ధన్యమైంది: అనుష్క
2005 సంవత్సరంలో వచ్చిన 'సూపర్' సినిమాతో ప్రారంభించి నటిగా అనుష్క ప్రయాణానికి 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'నిశ్శబ్దం' ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్ను చిత్ర బృందం గురువారం హైదరాబాద్లోఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు దర్శకులు, నిర్మాతలు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.
రాజమౌళి అనుష్కపై ప్రశంసలు కురిపించారు. ఆమె తనకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు.
"స్వీటీ నాకు చాలా సన్నిహితురాలు, ఫ్యామిలీ ఫ్రెండ్. తను మంచి అబ్జర్వర్. ప్రతి విషయాన్నీ చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. 'విక్రమార్కుడు' సినిమా చేసేటప్పుడు ప్రతి షాట్ను ఎలా చెయ్యాలో చేసి చూపించమనేది. నేను చేసి చూపిస్తే తను దాన్ని తనకు తగ్గట్లుగా మలచుకొని చేసేది. ఆఖరుకి రవితేజతో రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేది. అలా అన్నీ నాతో చేయించింది. ఆ సినిమాలోనే మా కుటుంబం మొత్తానికి తను సన్నిహితురాలైంది. నాతో పాటు మా ఆవిడకూ, మా వదినకూ, మా పిల్లలకూ సన్నిహితమైపోయింది. నాకే సన్నిహితురాలేమోనని ఇంతదాకా అనుకుంటూ వచ్చాను. ఇక్కడకు వచ్చాక తెలిసింది, తను అందరికీ సన్నిహితురాలేనని," అన్నారు రాజమౌళి.
"నా సినిమాల్లో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు పెద్దగా క్రియేట్ చెయ్యను. కానీ దేవసేన పాత్రను సృష్టించినందుకు గర్వంగా ఫీలవుతుంటాను, ఎందుకంటే దాన్ని స్వీటీ పోషించిన విధానం. చాలామంది హీరోయిన్లతో పనిచేస్తుంటాం, వాళ్లను చూస్తుంటాం. కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ఇష్టపడతాం. స్వీటీని ఒక నటిగా, ఒక మనిషిగా చాలా గౌరవిస్తాను. ఆ విషయంలో నా హృదయంలో ఆమెకో ప్రత్యేక స్థానం ఉంది. తను ఫెంటాస్టిక్ రోల్స్ చేసింది. ఇంకా చేస్తుందని నాకు తెలుసు. 'నిశ్శబ్దం' టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఆ సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 2 కోసం ఎదురుచూస్తుంటా," అని చెప్పారు రాజమౌళి.
అనుష్క తన దర్శకులందరికి కృతజ్ఞతలు తెలిపింది. "సీనియర్స్ సాధించిన దానితో పోలిస్తే నేను సాధించింది చాలా తక్కువ. అయితే దీన్ని నేను ఓ బాధ్యతగా తీసుకొని ఇంకా హార్డ్వర్క్ చెయ్యాలి, ఇంకా మంచి స్క్రిప్ట్స్ చెయ్యాలనుకుంటాను. 'సూపర్' నుంచి 'నిశ్శబ్దం' వరకూ.. పూరి జగన్నాథ్ గారి నుంచి మొదలుకొని, ప్రతి సినిమా డైరెక్టర్కూ చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా," అని అనుష్క అందరికి నమస్కరించింది.
"ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సినిమాపై నా నాలెడ్జ్ ఎలా ఉండిందో పూరి జగన్నాథ్ గారికి తెలుసు. ప్రతి సినిమా నాకొక మెట్టు. సహ నటులు, నిర్మాత, ప్రతి యూనిట్ మెంబర్తో ఒక ప్రయాణం చేస్తూ వచ్చాను. మంచి, చెడు అనుభవాలతో ఇక్కడి దాకా వచ్చాను. ఈ పదిహేనేళ్లలో నాతో కలిసి పనిచేసిన, ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 'నిశ్శబ్దం' చిత్రం ఏప్రిల్ 2న వస్తోంది. ఒక భిన్నమైన చిత్రం అందించాలని మా వంతు ప్రయత్నం చేశాం. దీనికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక్కడకు వచ్చి ఈ ఈవెంట్ను నాకు ప్రత్యేకమైనదిగా మార్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్," అన్నారు అనుష్క.
- Log in to post comments