తెలుగు ప్రభుత్వాలు అవార్డులివ్వవా?: జయసుధ

Jayasudha urges governments to present awards to film stars
Tuesday, September 3, 2019 - 19:30

మోహన్‌బాబుతో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన జయసుధ ఆయన్ని సోదర సమానుడిగా చూస్తానంటోంది. ఇండస్ట్రీలో ఆమెకి ఇద్దరు బ్రదర్స్‌ ఉన్నారట. వారిలో ఒకరు మోహన్‌బాబు. మరొకరు మురళీ మోహన్‌. ఆమెకి అభినయ మయూరి అనే అవార్డును ప్రకటించారు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. "మనం 'మహానటి' అనే మాటను ఒకరికే ఉపయోగిస్తుంటామనీ, కానీ అందరూ మహానటిలే,"ననీ ఆమె అన్నారు 

"మహానటి అంటే మనం ఒక్కరే అనుకుంటాం. అందరూ మహానటిలే. మహనటి అయితే తప్ప ఇండస్ట్రీలో సస్టైన్ అవలేం. జమున గారి నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నా. ఆమెకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. వాటిని శాక్రిఫైస్ చెయ్యకుండా సక్సెసయ్యారు. మురళీమోహన్ గారు ఎవర్‌గ్రీన్ హీరో. ఆయన (జుట్టుకి) కలర్ వేసుకున్నా, వేసుకోకపోయినా యువకుడిలాగే కనిపిస్తారు. మా ఇంట్లో జీన్స్ ప్రకారం నా జుట్టు ఊడిపోతోంది." అని ఆమె అన్నారు.

ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ వాటిని ఇంతవరకు ప్రదానం చేయలేదు. ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాటిపై ఫోకస్‌ పెట్టలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు తెలుగు సినిమాలకి అవార్డుల సిస్టమే ప్రారంభించలేదు. ఈ విషయంలో మొట్టమొదటిసారిగా పెదవి విప్పన సెలబ్రిటీ జయసుధనే. 

"రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. తమిళనాడు ప్రభుత్వం సినిమా ప్రముఖులకు కలైమామణి అవార్డు ఇస్తూ వస్తోంది. వాళ్లు దాన్ని బాగా చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని ఏ పేరుతో ఇస్తారో.. ఇవ్వాలి. వాళ్లే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? మేం చాలా కార్యక్రమాలకు వస్తుంటాం. సోషల్ వర్క్‌కు రావాలంటే వస్తాం. అలాంటి మమ్మల్ని గుర్తించి అవార్డులిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల నవ తరానికి కూడా అవార్డు విలువ తెలుస్తుంది. ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా సుబ్బరామిరెడ్డి గారు ఆయన బర్త్‌డేకి అవార్డులు ఇస్తుంటారు. 20 ఏళ్ల నుంచీ నిర్విరామంగా ఆయన అవార్డులు ఇస్తుండటం చాలా గొప్ప విషయం" అని  ప్రభుత్వాలకి సూచించారు.