ఎట్టకేలకు సెట్స్ పైకి క్రిష్.. కానీ!
కథానాయకుడు, మహానాయకుడు డిజాస్టర్ల తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన క్రిష్ ఎట్టకేలకు సెట్స్ పైకి రాబోతున్నాడు. అలా అని అతడు మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడని అనుకోవద్దు. నిర్మాతగా సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు ఈ దర్శకుడు. అవును.. దిల్ రాజుతో కలిసి ఓ సినిమా స్టార్ట్ చేశాడు క్రిష్. ఈ మూవీకి నూటొక్క జిల్లాల అందగాడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నిర్మితం కాబోతున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ హీరో. హీరోయిన్ గా చిలసౌ ఫేమ్ రుహానీ శర్మను ఎంపిక చేశారు. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు క్రిష్.
కంటెంట్ బాగుంటే మరో నిర్మాతతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమని రీసెంట్ గా ప్రకటించాడు దిల్ రాజు. అలా చెప్పిన కొన్ని రోజులకే క్రిష్ తో కలిశాడు. సినిమా షూటింగ్ వివరాలతో పాటు ఇతర టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే బయటకొస్తాయి. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతోంది నూటొక్క జిల్లాల అందగాడు సినిమా.
- Log in to post comments