మహేష్ నుంచి డబుల్ బొనాంజా
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 31న మహేష్ నుంచి కొత్త సినిమా ప్రకటన రాబోతోంది. అతడు పరశురామ్ బుజ్జి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రాజెక్టునే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు ఆరోజు. వీలైతే ఇంకొంత ఎక్స్ ట్రా సమాచారాన్ని కూడా ఆరోజు అందించే ఛాన్స్ ఉంది.
అయితే ఎవరూ ఊహించని విధంగా ఆరోజున రెండు సినిమాలు ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట మహేష్. ఈమధ్య ఊహించని విధంగా గ్యాప్ వచ్చేయడంతో నిరాశతో ఉన్న అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ఇలా ఒకేసారి 2 సినిమాలు ప్రకటించాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఆ రెండో ప్రాజెక్టు ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మహేష్ తో త్వరలోనే సినిమా చేయబోతున్నానని ఈమధ్య రాజమౌళి ప్రకటించాడు. ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి వచ్చిన వెంటనే మహేష్ మూవీ పనులు మొదలుపెడతానని స్పష్టంచేశాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో మహేష్ మూవీకి సంబంధించి చిన్నపాటి స్టోరీ డిస్కషన్ కూడా స్టార్ట్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు. కాబట్టి మహేష్ ఈ ప్రాజెక్టును కూడా తన తండ్రి పుట్టినరోజు నాడు అఫీషియల్ గా వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. అటు దుర్గా ఆర్ట్స్ అధినేత నారాయణ ఇదే పని మీద ఉన్నట్టు తెలుస్తోంది. మహేష్ నుంచి అనుమతి తీసుకొని ప్రాజెక్టును గ్రాండ్ గా ప్రకటించాలని ఆయన చూస్తున్నాడు.
- Log in to post comments