ఫస్ట్ టైమ్ రవితేజ తగ్గించుకున్నాడు
సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గడు రవితేజ. ఇప్పటికీ అదే పంథా. చివరికి "నేలటిక్కెట్టు" సినిమా డిజాస్టర్ అయిన తర్వాత కూడా రవితేజ తగ్గలేదు. తనకు కావాల్సిన రెమ్యూనరేషన్ అడిగి మరీ తీసుకున్నాడు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమా తర్వాత రవితేజ మైండ్ సెట్ లో మార్పు వచ్చిందని చాలామంది చెప్పుకొచ్చారు. దానికి నిదర్శనమే "మహాసముద్రం" సినిమా.
అవును.. ఈ సినిమాకు పారితోషికం తీసుకోవడం లేదు రవితేజ. సినిమా రిలీజ్ తర్వాత లాభం వస్తే షేర్ తీసుకుంటాడు. నష్టమొస్తే అంతే సంగతులు. ఈ కండిషన్ పైనే మహాసముద్రం ప్రాజెక్టు సెట్ అయిందంటున్నారు చాలామంది. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.
రవితేజకు హిట్ పడి చాన్నాళ్లయింది. 2017లో వచ్చిన "రాజా ది గ్రేట్" తర్వాత మళ్లీ సక్సెస్ చూడలేదు ఈ సీనియర్ హీరో. అయినప్పటికీ పారితోషికం మాత్రం తగ్గించలేదు. అడిగినంత ఇచ్చిన ప్రొడ్యూసర్ కే కాల్షీట్లు ఇచ్చాడు. కానీ "టచ్ చేసి చూడు", "నేలటిక్కెట్టు,", "అమర్ అక్బర్ ఆంటోనీ".. ఇలా చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అవ్వడంతో ఈసారి పారితోషికంపై కాస్త వెనక్కితగ్గాడట.
"డిస్కోరాజా"కు తను అనుకున్నంత ఎమౌంట్ తీసుకున్న రవితేజ, "మహాసముద్రం"తో తొలిసారి ఇలా షేరింగ్ బేసిస్ లో సినిమా చేస్తున్నాడు.
- Log in to post comments