రజాకార్ల ఉద్యమంలో చిరంజీవి

ఇప్పటికే సైరా సినిమా చేశారు చిరంజీవి. స్వతంత్ర పోరాటానికి ఆద్యం పోసిన సైరా నరసింహారెడ్డి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించారు. ఇలాంటి హీరో తెలంగాణ రజాకార్ల పోరాటంలో కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది దర్శకుడు సంపత్ నందికి.
అవును.. చిరంజీవి కోసం తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో ఓ పాయింట్ అనుకొని కథ రాస్తున్నాడు సంపత్ నంది. అది మొత్తం పూర్తయిన తర్వాత చిరంజీవిని కలిసి కథ వినిపిస్తానంటున్నాడు ఈ దర్శకుడు. మెగాస్టార్ తో మూవీ చేయడాన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకొచ్చాడు.
అంతేకాదు.. అటు పవన్ కల్యాణ్ కోసం కూడా ఓ కథ సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం సీటీమార్ సినిమా చేస్తున్న ఈ డైరక్టర్.. అది పూర్తయిన వెంటనే పవన్ ను కలిసి కథ వినిపిస్తానంటున్నాడు.
సంపత్ నంది డ్రీమ్స్ బాగానే ఉన్నాయి కానీ ఈ విషయంలో అతడు కాస్త లేట్ అయ్యాడనే విషయం తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఇటు పవన్ కల్యాణ్, అటు చిరంజీవి చేతిలో ఆల్రెడీ మూడేసి సినిమాలున్నాయి. అవి కూడా ఊహాగానాలు కావు, కన్ ఫర్మ్ అయిన సినిమాలు. సో.. సంపత్ నందికి మంచి కథతో వీళ్లను ఒప్పించినప్పటికీ మరో రెండేళ్లు వెయిటింగ్ తప్పకపోవచ్చు.
- Log in to post comments