నాది హైదరాబాద్.. కావాలంటే అమ్మని అడగండి
తెలుగు మాట్లాడ్డం రాకపోయినా తనది హైదరాబాద్ అంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. అంతేకాదు, తనకు భాగ్యనగరంలో 5 వందల మందికి పైగా చుట్టాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చింది. తమ బంధుగణంలో 80 శాతానికి పైగా అంతా తెలుగులోనే మాట్లాడతారని అంటోంది ఈ బ్యూటీ.
"మిస్టర్ మజ్ను" ప్రమోషన్ లో భాగంగా ఈ వివరాల్ని బయటపెట్టింది. హైదరాబాద్ లో తమకు సొంత ఇల్లు కూడా ఉందంటున్న నిధి, తన తల్లికి తెలుగు బాగా వస్తుందని, "మిస్టర్ మజ్ను" సినిమా చూసి అక్కడక్కడ కన్నీళ్లు కూడా పెట్టుకుందని చెప్పుకొచ్చింది. తనకు తెలుగు అర్థమౌతుందని కానీ, పూర్తిస్థాయిలో మాట్లాడలేనని స్పష్టంచేసింది. తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లిష్ భాషలు తనకు తెలుసంటోంది.
హైదరాబాద్ వంటకాలంటే తనకు ఎంతో ఇష్టమని..అన్ని రకాల రుచులు ఎంజాయ్ చేస్తానని చెబుతోంది. ఇక కొత్తగా ఒప్పుకున్న పూరి జగన్నాధ్ సినిమా గురించి కూడా మాట్లాడింది నిధి. తెలుగులో నిధి చూసిన మొదటి సినిమా "పోకిరి" అట. ఆ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని, ఇప్పుడు అదే దర్శకుడితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని అంటోంది. "ఇస్మార్ట్ శంకర్" సినిమాలో తన పాత్ర గురించి చెప్పడానికి మాత్రం ఈమె నిరాకరించింది.
- Log in to post comments