అఖిల్ సినిమా వాయిదా పడిందా?
అఖిల్ నటించిన మూడో సినిమాకి కూడా వాయిదాల పర్వం తప్పడం లేదు. అఖిల్ నటించిన మొదటి రెండు సినిమాలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాయి. ఆ రెండూ (అఖిల్, హలో) ఫ్లాప్ అయ్యాయి. ఈ సారి ఇతర పెద్ద సినిమాల కారణంగా రెండు నెలల పాటు వాయిదా వేయక తప్పడంలేదట.
అఖిల్ నటిస్తున్న మూడో చిత్రం.."మిస్టర్ మజ్ను". ఈ ఏడాది వరుణ్ తేజ హీరోగా "తొలిప్రేమ" అనే సినిమాని తీసి మంచి పేరు సంపాదించుకున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరి తీస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే "మిస్టర్ మజ్ను" టీజర్ వచ్చింది. డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నామని నిర్మాతలు ప్రకటించారు.
ఐతే డిసెంబర్ 21న పోటీ భారీగా ఉండనుంది. వైఎస్సార్ బయోపిక్గా వస్తున్న "యాత్ర", వరుణ్ తేజ నటిస్తున్న "అంతరిక్షం" చిత్రాలు డిసెంబర్ 21న రానున్నాయి. దాంతో మిస్టర్ మజ్ను పోటీ నుంచి తప్పుకొంది. దానికి తోడు సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్, రామ్చరణ్ చిత్రం, వెంకటేష్ "ఎఫ్2" పోటీలో ఉన్నాయి. జనవరి 24న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం కూడా విడుదల కానుంది. అందుకే ఏకంగా రెండు నెలల పాటు వాయిదా వేశారు అఖిల్ చిత్రాన్ని. ఫిబ్రవరి8, 2019 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
- Log in to post comments